భారతీయ సంస్కృతిలో అతి ప్రాధాన్యత సంతరించుకున్న కళలలో కవిత్వం ఒకటి. రవి కాంచని చోట కూడా కవి కాంచును అన్నట్లు కవి హృదయం ప్రతి చిన్న విషయాన్ని సునిశితంగా ఆలోచించగలుగుతుంది. ఈ ఆలోచనకు కవి అక్షరాలలో ప్రాణం పోసి వ్యవస్థకు చైతన్యాన్ని కలిగించటానికి, ఆనందాన్ని అందించటానికి మంచి, చెడులను అర్థం చేసుకోవటానికి చరిత్రను, సాంప్రదాయాలను, అలవాట్లను, కట్టుబాట్లను ప్రపంచానికి తెలియచేయటానికి ఉపయోగిస్తారు. కవిత్వంతో ఎందరో మహానుభావులు ఈ సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించి కావ్యాలను రచించి, లోక కళ్యాణానికి ఆద్యులయినారు.
కవిత్వంలో కఠిన పాషాణాలే కరుగుతాయి అంటారు. ఇంతటి మహా ప్రక్రియ నాకు ఎంతో ఇష్టమయినది. నా తండ్రిగారు వంగిపురపు వీరరాఘవాచారిగారి ప్రేరణతో నా యొక్క రచనా ప్రస్థానం మొదలయ్యింది. నాకు పెద్దగా భాషాజ్ఞానం లేకున్నా ఈ ప్రక్రియను సామాన్యులకు అర్థమయ్యేలా సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి అనే ఉత్సుకతతో నా ప్రయత్నం మొదలయ్యింది. ఈ అంశములను ఎవరినీ ఉద్దేశించి గానీ, ఎవరినీ నొప్పించాలని గానీ రాయడం జరగలేదు.
ఇందులో ఏవైనా పొరబాట్లు ఉన్నట్లయితే పెద్ద మనసుతో విజ్ఞులు, పాఠకులు, పెద్దలు మన్నించి నన్ను ఆశీర్వదిస్తారని నిండు మనసుతో కోరుకుంటున్నాను. నా ఈ కవితలు సమాజంలో ఉండే రకరకాల అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నాను. నేటి ఆధునిక సమాజంలో ఉన్న అభాగ్యుల జీవితాలు మారి ఆనందమయం కావాలని చెడు భావనలు పోయి మంచి ఆలోచనలతో ఆంధ్రుల అమరావతి ఆనందదామం కావాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.
సర్వేజనాః సుఖినోభవంతుః